19, సెప్టెంబర్ 2009, శనివారం

మూడువందల ముప్ఫైతొమ్మిదవ సభ

బాలభారతి

స్థానిక గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విజయభావన మూడువందల ముప్ఫైతొమ్మిదవ సభలో విజయనగరంజిల్లాలో బాలసాహిత్యం తీరుతెన్నులపై సాలూరుకుచెందిన రచయిత కిలపర్తి దాలినాయుడుగారు ప్రసంగించారు.
బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సభకు బగ్గం రామజోగారావుగారు అధ్యక్షత వహిస్తూ సాహిత్యంలో విజయభావన చేసిన కృషిని ప్రశంసించారు. విజయభావన సహాయకార్యదర్శి శ్రీమతి ఎ. లలితా శంకర్ గారు సమ్మానకర్తగా వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శి డా|| ఎ. గోపాలరావు గారు స్వాగత వచనాలు పలికి అతిథుల్ని సభకు పరిచయంచేశారు. దాలినాయుడుగారు బాలసాహిత్యానికి వివిధ స్థాయిలలో చేస్తున్న కృషి, ఆయన పొందిన పురస్కారాలు తెలిపి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన దాలినాయుడుగారి ప్రసంగంలో కొన్ని ముఖ్య అంశాలు:
పద్ధెనిమిదవ శతాబ్దం తరువాత ముద్రణలోకి అనేక బాల కథలు వచ్చాయి.
పొడుపుకథలు, దేశభక్తి, వీరగాథలు వంటి ఎన్నో అంశాలు బాలసాహిత్యం పాటలద్వారా పిల్లలలో ఆసక్తి రేపి సమాజ శ్రేయస్సు కోసం పాటు పడేలా చేసింది.
ఏవిధంగా అయితే పాలు సంపూర్ణ ఆహారంగా పిల్లలకు ఉపయోగ పడుతుందో అదేవిధంగా బాలసాహిత్యం పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడుతుంది.
పాత చందమామల దగ్గరనుండీ నేటి నాని పత్రిక వరకూ బాల సాహిత్యంలో సృజనాత్మతకు అద్దం పడుతున్నాయి.
జిల్లాలోని బాల సాహిత్యం గురించి మాట్లాడుతూ ఈ జిల్లాలోనే ఎక్కువ కృషి జరిగిందని తెలిపారు. గురజాడ వంటి మహాకవులదగ్గరనుండి నేటి తరంలో ఎ.బి సుబ్బారావు, రఘునందం మొదలైనవారి వరకూ అనేకమంది ఇందులో కృషిచేస్తున్నారని అన్నారు.
ఉదాహరణగా కొన్ని కథలు, పాటలు వినిపించారు.
పార్వతీపురానికి చెందిన బి. వి. పట్నాయక్ గారు వ్రాసిన రాజు-విగ్రహం అనే కథ ద్వారా మంచిపనులు చేయవలెనని సూచించారని తెలిపారు. ఒక రాజుగారు తన విగ్రహాలని స్థాపించాలని ఆలోచించి మంత్రిగారితో చర్చించారు. ఒకనాడు ఆ మంత్రి, రాజు ఉద్యానవనంలో విహరిస్తుండగా కాకి రాజుగారి మీద రెట్టవెసిపోయింది. అది తుడుచుకున్న తరువాత రాజుగారికి తన విగ్రహం పెడితే ఎన్నోకాకులు ఇలా రెట్టలు వేస్తూ ఉంటాయి. మరి తుడిచేవారెవరు అన్న అనుమానం వచ్చింది. చివరకు మంత్రిగారి సలహామీద పేరు నిలవాలంటే విగ్రహాలు నిలబెట్టడంకన్నా మంచిపనులు చేయవలెనని గుర్తించి ఆవిధంగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
పాటల ద్వారా సైన్సు పాఠాలను కూడా చెప్పవచ్చని తెలుపుతూ తను వ్రాసిన ఎందుకని - ఎందుకని అనే గేయాన్ని వినిపించారు.
ఎందుకని -ఎందుకని
దీపం నిత్యం పైకే కాలును ఎందుకని - ఎందుకని
అలాగే గణిత పాఠాలు నేర్పవచ్చన్నారు.
తెలుగు చక్కగా రావడానికి బలసాహిత్యం తిరుగులేని మాధ్యమం అని అన్నారు. అక్షరాలు పలకడం అలవాటు కావడానికి, ఒకే అక్షరం ఎక్కువసార్లు ఉపయోగిస్తూ పాటలు వ్రాయవచ్చని సోదాహరణంగా వివరించారు.
ఇక వ్యక్తిత్వవికాసానికి సంబంధించి పాము కథని వినిపించారు. ఒక ముని పాముని సాధుజీవిగామారమని, కాటు వేయడం మానుకోమని ఉపదేశించి వెళ్ళిపోవును. ఆ పాము ఆ విధంగా జీవించడం మొదలుపెట్టింది. ఎవరు ఏంచేసినా ఎదురుతిరగకుండా ఉండేది. దానితో అందరూ రాళ్ళు వేస్తూ దానిని బాధించాసాగారు. అయినా అది అలాగే ఉంది. కొన్నాళ్ళకి ఆ ముని మరల వచ్చి పాము దీనస్థితిని చూశాడు. ఏమయ్యిందని అడిగితే మహాత్మా మీరు సాధుజీవిగా ఉండమన్నారు దాని ఫలితమే ఈ దెబ్బలు అని అన్నది. అది విని సాధువు నేను కాటు వేయవద్దన్నాను కానీ బుస కొట్టవద్దనలేదు కదా! నీ ఆత్మరక్షణకు నీవు బుస కొట్టాలి. లేనిచో బ్రతుకు కష్టమగుని అని హితవు పలికెను. ఆ తరువాత పాము ఆ విధంగా చేస్తూ హాయిగా జీవించింది.
అదేవిధంగా చెడ్డవాళ్ళతో స్నేహం మంచిదికాదని చెప్పే నక్క, సింహం కథ ఉదహరించారు. ఒక అడవిలో సింహంతో సహా అన్ని ప్రాణులూ శాఖాహారులై కలసి మెలసి జీవించేవి. ఒక నాడు ఒక నక్క ఎక్కడినుండో వచ్చింది. ఇక్కడి పరిస్థితి గమనించింది. మాంసం తినాలనే కోరికతో అది సింహంతో స్నేహంచేసి జంతువులను తినవలెనని బోధ మొదలెట్టింది. ఇది గ్రహించిన సింహం దానిని కనపడ వద్దని పంపివేసింది. ఆ నక్క మెల్లిగా సింహం పిల్ల దగ్గర చేరింది. సింహంలేని సమయంలో సింహంపిల్లకు ఒక కుందేలుని చంపి మాంసంరుచి చూపించింది. కొంత అలవాటు చేసినతరువాత ఇక తను మాంసం ఇవ్వలేనని సింహాన్నే అడగమని పురిగొల్పింది. సింహం పిల్ల తండ్రి దగ్గర మాంసంకావాలని గోల చేసింది. ఈ కోరిక పుట్టడానికి వెనుకాల వేరే ఎవరో ఉండి ఉంటారని పసిగట్టిన సింహం ఆరా తీసి నక్క పని అని కనుక్కుని మళ్ళీ ఈ అడవికి వస్తే తాను తినబోయే మొదటి జంతువు ఆ నక్కే అవుతుందని హెచ్చరించి దానిని తరిమికొట్టింది. సింహం పిల్లను మంచి మాటలతో బోధచేసి, చెడు సావాసాలకు దూరంగా ఉండాలని హితవు చెప్పింది.
అలాగే పిల్లచే కథలు, కవితలు వ్రాయించిన వారిలోని సృజనాత్మకత మరింత మెరుగుపడుతుందని అన్నారు. ఉదాహరణగా పాలు, డోలు, మేలు మొదలైన పదాలు ఇచ్చి వాక్యం చివర ఇవి వచ్చేలా వ్రాయమని అన్నప్పుడు,
ఆవు ఇచ్చును తెల్లని పాలు
ఆవు మెడలో గంగడోలు
ఆవు చేయును ప్రజలకు మేలు .. అంటూ ఒక చిన్న పిల్ల వ్రాసిన కవితలో గంగడోలు అన్న పదం మామూలుగా ఎవరికీ తెలియదని. దానిని అక్కడ వాడడంలో ఆ చిన్నారి చూపిన నేర్పు అభినందనీయమని కొనియాడారు.
ఆపైన ప్రభుత్వం బాలసాహిత్యానికి చేస్తున్నకృషిని కూడా వినరించారు.
బాలలవాణి అనే సంస్థద్వారా ప్రభుత్వం పిల్లల ప్రచురణల కార్యక్రమం చేపట్టిందని, డైట్ ప్రముఖులు ఆధ్వర్యంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందిపబడ్డాయని తెలిపారు. ఈ పిల్లల రచనలలో సుమారు ఇరవైఆరువేల బాలల రచనలు ఒక్క విజయనగరం జిల్లానుండే అందాయని. ఇది ఇక్కడి ఉపాధ్యాయుల కృషి ఫలితమని శ్లాఘించారు. శ్రీ శాంతిస్వరూప్ గారి సంపాదకత్వంలో పుస్తకాలు కూర్చబడి, జోనల్ వారీ గా పాఠశాలలకు ఈ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు.
కార్టూనిష్టుగా ఉన్న తను బాలసాహిత్యం పై ఆకర్షితుడనై ఈ రంగంలో కృషిచేస్తున్నాని తెలిపారు.

1 కామెంట్‌:

  1. విజయభావన సాహితీమిత్రసమాఖ్య మూడు వందల ముప్ఫై తొమ్మిదవ సభను నిర్ విఘ్నంగా నిర్వహించినందుకు
    గౌ.అధ్యక్షులు శ్రీ నరసింహ రాజుగారికి, అధ్యక్షులు శ్రీ అవధాని గారికి, ఉపాధ్యక్షులు శ్రీ ప్రకాష్ గారికి, కార్యదర్శి శ్రీ గోపాలరావు మాష్టారికి, కోశాధికారి శ్రీ నరసింహం గారికీ, కార్యవర్గ సభ్యులందరికి నా అభినందనలు.
    కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ బగ్గాం రామ జోగారావుగారినీ, ముఖ్య వక్త శ్రీ దాలినాయుడు గారినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.

    రిప్లయితొలగించండి