16, డిసెంబర్ 2009, బుధవారం

శతావధాన సాహితీ క్రతువు

తేదీలు : 25,26,27 డిశెంబరు, 2009
సమయం : ప్రతి రోజూ ఉదయం 9 గం|| ల నుండి 1 గం|| వరకు
సాయంత్రం 4 గం|| ల నుండి 8 గం ||ల వరకు

వేదిక : ఆనందగజపతి కళాక్షేత్రం - విజయనగరం

అవధాని : సహస్ర భారతి, మహా సహస్రావధాని, ధారణా బ్రహ్మరాక్షసుడు
డా|| గరికిపాటి నరసింహారావు

సంచాలకులు : శ్రీ పేరి రవికుమార్

అప్రస్తుత ప్రసంగం : శ్రీ రాంభట్ల నృసింహశర్మ (ఆకాశవాణి, విశాఖ)
శ్రీ ధవళ సర్వేశ్వరరావు
డా|| జక్కు రామకృష్ణ
డా|| భైరవభట్ల విజయాదిత్య
పృచ్చకులు :

సమస్య : అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ, శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు, శ్రీ కె. మార్కండేయులు, శ్రీ క్రొవ్విడి శారదా ప్రసాద్, శ్రీ కె. పి. ఎస్. పంతులు, డా|| తాతా వెంకటలక్ష్మి, శ్రీ పంతుల దక్షిణామూర్తి ప్రసాద్, శ్రీ తూట బాబాజీ, శ్రీ ఎస్. శ్రీకాంత్, శ్రీ ఎమ్. వి. కృష్ణమూర్తి, శ్రీ కొణిశ హరి, డా|| టి. జి. కృష్టారావు, శ్రీ కె. బాబూరావు, శ్రీ పి. వి. రాధాకృష్ణ, డా|| పి. టి. జి. రంగాచార్యులు, అవధాని కె. చంద్రశేఖర్, శ్రీ బి. హెచ్. శివరామ్, శ్రీ ఎ. రాధాప్రసాద్, శ్రీ నేతేటి గణేశ్వరరావు, శ్రీ ఆర్. సత్యం, శ్రీ కె. పూజ్యనాథాచారి, శ్రీ జి. సన్యాసినాయుడు, శ్రీ సర్వాజోస్యుల గౌరీశంకరశాస్త్రి, శ్రీ వి. రమణ, శ్రీ టి. సత్యనారాయణ

దత్తపది : శ్రీమతి బి. హెచ్. దేవీప్రకాష్, శ్రీ నల్ల బాలకృష్ణ, శ్రీ కిలపర్తి దాలినాయుడు, శ్రీ గుమ్మా రంగారావు, శ్రీ పి. వెంకటకృష్ణయ్య, కుమారి ఎల్. సీతామహాలక్ష్మి, కుమారి పి. స్వాతి, శ్రీ ఆర్. పవన్‍కుమార్, శ్రీమతి బి. విజయభారతి, శ్రీ పి. రాజేశ్వరరావు, శ్రీ టి. రమణ, డా|| ఆర్. శశికళ, డా|| సి. సూర్యనారాయణ, శ్రీ బెహరా గణేశ్, కుమారి అడిదం శారద, శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు, శ్రీ కె. వి. జగన్నాథరావు, శ్రీ బి. రామజోగారావు, శ్రీ చౌదరి చిట్టన్న, శ్రీ ఎమ్. పార్వతీశం, కుమారి బి. తారకేశ్వరి, కుమారి కె. ఎన్. ఎస్. హైమవతి, శ్రీ బి. కోటారావు, కుమారి కె. సంతోషిలక్ష్మి, శ్రీ వి. శ్రీను.

వర్ణన : శ్రీమతి గుమ్మా చంపావతి, శ్రీమతి పి. హేమకామేశ్వరి, శ్రీ దేవరకొండ రామనరసింగరావు, శ్రీ బి. హెచ్. కె. బాబూజి, శ్రీ జి. ఆర్. రాఘవరాజు, శ్రీ ఎ. సదాశివరాజు, శ్రీ ఆర్. నాగార్జునరావు, శ్రీ పి. లక్ష్మణరావు, శ్రీ ఎస్. సోమేశ్వరరావు, శ్రీమతి ఎ. లలితాశంకర్, శ్రీ చిట్టెళ్ళ వెంకట సుబ్రహ్మణ్యశర్మ, శ్రీ జి. గోవిందరాజు, శ్రీ వి. నీలకంఠాచారి, శ్రీమతి బి. రుక్మిణి, శ్రీమతి సి. హెచ్. ఎస్. ఎల్. నరసమ్మ, శ్రీమతి ఆర్. లక్ష్మి, కుమారి పి. కారుణ్యకవిత, కుమారి వై. భార్గవి, శ్రీ జి. రమణమూర్తి, శ్రీ దివ్వెల చిన్నారావు, శ్రీమతి పేరి సావిత్రి, శ్రీ రేవళ్ల ఆదినారాయణ, శ్రీమతి సి. హెచ్. శ్రీలక్ష్మి, శ్రీమతి భావవరపు సత్యవతి, శ్రీ గన్నవరపు దుర్గాప్రసాద్.

ఆశువు : 25 గురు ఎంపిక చేసిన సహృదయ ప్రేక్షకులే పృచ్ఛకులు

శతావధాన సభలు

శతావధాన ప్రారంభ సభ

అధ్యక్షులు : సేవాశిరోమణి
శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
గౌరవాధ్యక్షులు, విజయభావన
జ్యోతిప్రకాశకులు : శ్రీ గురాన సాధూరావు
ప్రముఖ వ్యాపారవేత్త, సంఘసేవకులు
అవధాని : మహాసహస్రావధాని
డా|| గరికిపాటి నరసింహారావు
ముఖ్య అతిథి : శ్రీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎం.ఎల్.సి
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు
విశిష్ట అతిథి : శ్రీ వి. వి. కాశీవిశ్వనాథం
పూర్వాధ్యక్షులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, విజయనగరం
అవధాన సంచాలకులు : ప్రఖ్యాత సాహితీవేత్త
శ్రీ పేరి రవికుమార్, విశాఖ

సమయం : తే|| 25-12-2009 ఆదివారం, సాయంత్రం గం|| 9.00 గం|| లకు


శతావధాన సమాపనం - సమ్మాన వైభవం

అధ్యక్షులు : సేవాశిరోమణి
శ్రీ పి. వి. నరసింహరాజు (బుచ్చిబాబు)
గౌరవాధ్యక్షులు, విజయభావన
ముఖ్య అతిథి, పురస్కార ప్రదాత : శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి
అధ్యక్షులు, శ్రీసాయి ఫౌండేషన్
పురస్కార గ్రహీత : ధారణా బ్రహ్మరాక్షస - సహస్రభారతి
డా|| గరికిపాటి నరసింహారావు
ప్రియాతిథి : శ్రీ అవనాపు సూరిబాబు
మ్యున్సిపల్ చైర్మన్, విజయనగరం
గౌరవాతిథి : డా|| పి. లక్ష్మీనరసింహం, ఐ.ఎ.యస్
జాయింట్ కలెక్టర్, విజయనగరం.

ప్రత్యేక ఆహ్వానితులు : శ్రీ సి. యన్. జె. డి. ప్రసాద్
రీజనల్ మేనేజర్, రీజియన్ 5
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
విశాఖపట్నం.
: శ్రీ కె. ఆనందకుమార్
ఎఐయమ్ కాన్సెప్ట్ స్కూలు, విజయనగరం
: శ్రీ ఇ. ఆర్. సోమయాజులు (రాంజీ)
చార్టర్డ్ అకౌంటెంట్, విజయనగరం

2, డిసెంబర్ 2009, బుధవారం

తెలుగు వెలుగు

సభాప్రారంభాన్ని చేస్తూ డా|| ఎ. గోపాలరావు, శారదరాత్రులలో పూర్ణచంద్రుని, సుధాకరుని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదని చమత్కరిస్తూ అధ్యక్షులైన సుధాకర్ గారిని, వక్త పూర్ణచందు గారిని వేదిక మీదకు ఆహ్వానించారు. అటుపైన సమ్మానకర్త ఇందిరాంబగారికి ఆహ్వానం పలికారు. ప్రార్థన శ్రీ పంతులు చేయగా, అధ్యక్షులు శ్రీ సుధాకర్ మాట్లాడుతూ సాహిత్యకార్యక్రమాలలో పాల్గొంటే మంచి ఆలోచనలు వస్తాయని, జ్ఞానాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. విజయభావన సంస్థగురించి చెబుతూ ఇన్నేళ్ళూగా నిర్విరామంగా పనిచేస్తున్న సాహిత్య సంస్థ మరోటి లేదని కొనియాడారు. తనకు సాహిత్యంలో ప్రవేశం లేకపోయినా, చేసేవాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం ఉత్తమమని భావించి వస్తూన్నానని తెలిపారు. సమ్మానకర్త కుమారి ఇందిరాంబ మాట్లాడుతూ విజయభావన కీ||శే|| ఆచార్య భావన్ గారి సంకల్పబలం చేత, అందరిసహకారం చేత, సభ్యుల అంకితభావం చేత విజయవంతంగా నడుస్తోందని తెలిపారు. అనంతరం వక్తను సత్కరించారు.

సమ్మానకార్యక్రమానంతరం వక్త శ్రీ పూర్ణచందు తెలుగు భాష ప్రాచేనత- నూతన పరిశోధనాంశాలు అనే విషయం పై ప్రసంగిస్తూ విజయభావనలో ప్రసంగించడం ఒక యోగ్యతా పత్రంగా భావిస్తాంమని, తను చెప్పాలనుకున్న అంశాలను సాంస్కృతికరాజధాని గా భావించే విజయనగరంలో చెప్పాలని తన ఆకాంక్ష అని, అది తనబాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. (ఆసమయంలో కరెంటు పోయింది. కొవ్వత్తి వెలిగించేందుకు అగ్గిపెట్టె కోసం ప్రయత్నించగా సభలో ఎవరివద్దా దొరకలేదు. గ్రంథాలయం సిబ్బంది సకాలంలో వేరే ఏర్పాటు చేశారు. దీనిని చమత్కరిస్తూ శ్రీ పూర్ణచందు ‘విజయభావన సభకు వచ్చేవాళ్ళదగ్గర అగ్గిపెట్టె దొరకదు, అగ్గి పెట్టే వాళ్ళూ దొరకరు. ఇంతటి సంస్కారవంతులు కనుకే తను ఇక్కడ ఉపన్యసించాలనుకుంటున్నా’ అని అని నవ్వులు పూయించారు). సభ చిన్నదైనా పెద్దదైనా అందులో ప్రభావితం చెయ్యగల వ్యక్తులు ఉంటే అది మహా సభ అవుతుందని అటువంటి ఈ మహా సభ కు వందనం చేస్తున్నానని తెలిపి ప్రసంగాన్ని ప్రారంభించారు.

గమనిక : విషయం యొక్క క్లిష్టతచేత, కేవలం అప్పటికప్పుడు విని వ్రాసుకున్న విషయాలను ఆతరువాత కూర్చి వ్యాసం చేయడం చేత వక్త చెప్పినదంతా వ్యాసంలో పొందుపరచలేకపోయి ఉండవచ్చు. అదేవిధంగా వ్యాసంలో కొన్ని తప్పులు, తేడాలు కూడా దొర్లి ఉండవచ్చు. దానికి మీకు, వక్త కి క్షమాపణ తెలుపుకుంటున్నాం. వ్యాసం చదివేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవలసిందిగా ప్రార్థన.

ఆ ప్రసంగ సారాంశం :
ఇక్కడ నేను రెండు విషయాలు పై మాట్లాడదలుచుకున్నాను. ఒకటి తెలుగు భాష ప్రమాదం అంచున ఉన్నదా అన్న ప్రశ్న. ప్రస్తుతం ప్రధానంగా ముప్ఫై ఏడు భాషలు మరణించే స్థితిలో ఉన్నాయి. నిజానికి భాష ఎక్కడికీ పోదు. గ్రంథాల రూపంలో, శాసనాల రూపంలో, ఇతర మాధ్యమాల రూపంలో ఉంటుంది. అయితే అది ప్రజల నాలుక పై ఉంటుందా లేదా అన్నదే ప్రశ్న. ఉదాహరణకి సంస్కృతం ఇప్పటికీ గ్రంథాలలో సజీవంగానే ఉంది. అయితే ఎంతమంది దానిని వాడకంలో ఉపయోగిస్తున్నారు? ఇక తెలుగు విషయానికి వస్తే ‘ బస్ స్పీడ్ గా పోతుంది’. ఇది సాధారణంగా అనే వాక్యం. ఇందులో ‘పోతుంది’ అనే వాక్యం ఒక్కటే తెలుగు పదం. ఇదెప్పుడు ‘పోతుందో’ తెలియదు! ప్రస్తుతం తెలుగు రాదని చెప్పడం గొప్పగా భావించడం వల్లే మరణిస్తోంది. అంతమాత్రంచేత తెలుగు భాషోద్యమం ఇతరభాషలుకు వ్యతిరేకం కాదు. మన భాషను ప్రేమించడానికి, భాషపై అభిమానాన్ని పెంచడానికి మాత్రంమే మా (తెలుగు భాషోద్యమం) ప్రయత్నం. ఇక్కడ గుర్తుంచుకోవలసింది, ప్రజాభిమతంలేని రాజకీయం భాషాదురభిమానానికి దారితీస్తుంది. ఉదాహరణకి మహారాష్ట్రా. ప్రజాభిమతంతో రాజకీయం జోడైతే సత్ఫలితాలిస్తుంది. ఉదాహరణకి తమిళనాడు. ప్రజాభ్జీష్టం మేరకు తమిళానికి ప్రాచీనహోదా కోసం డి.ఎం.కె ప్రభుత్వం కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చి, కమిటీ వేయించారు. వాళ్ళు నో అబ్జక్షన్ చెప్పినతరువాత ప్రాచీన హోదాను కల్పించారు. అప్పుడు తెలుగు వారికి వేడి పుట్టి ఆ వైపుగా కృషి జరిగింది. అయితే తెలుగుభాషోద్యమం అంతకు ముందు నుంచీ ఉన్నదే. నిజానికి గిడుగువారి వ్యవహారిక భాషోద్యమానికి ఇది కొనసాగింపు మాత్రమే. ఆనాడు సంస్కృతపండితులు మొదలైన వారు అడ్డంకిగా ఉంటే ఇప్పుడు మామూలు ప్రజలే అడ్డంకిగా ఉన్నారు. తెలుగు భాష ఇంటిభాషగా, బడిభాషగా, ఏలుబడిభాషగా ఉండాలన్నదే మా అభిలాష.

ఇక పరిశోధనాంశాల విషయానికి వస్తే, ఇంకా గ్రంథస్థంకాని తాజా పరిశోధనాంశాలను మీ దృష్టికి తేవాలనే సంకల్పంతోనే ఇక్కడకు రావడం జరిగింది. ఈ మధ్య జరిగిన మైదుకూరు సంఘటన తెలిసినవిషయమే. జన్మలో తెలుగులో మాట్లాడనని వ్రాయించి, తెలుగుపై ధ్వేషంన్ని పెంచుతున్నారు. ఇటువంటి సంఘటన మొదటిది కాదు, చివరిదీ కాబోదు. అది అలా ఉంచితే, తాజాగా వచ్చిన ఒక వార్త. ఈ నవంబరు ఐదున ఒక జర్మన్ వెబ్సైట్లో పరిశోధకులు తమ పరిశోధనా వివరాలను ఉంచారు. అప్పుడే పుట్టిన సద్యోజాత శిశువు ఏడుపు మాతృభాషలో ఉంటుందని వారు కనుగొన్నారు. ఈ పరిశోధనకై వారు అప్పుడే పుట్టిన ఫ్రెంచ్ పిల్లల, జర్మన్ పిల్లల ఏడుపులు విశ్లేషించారు. తేడాలు గమనించారు. జర్మన్ పదాలు హెచ్చు స్వరాలనుండి తగ్గుస్వరాలకు వస్తాయి. అదే ఫ్రెంచ్ లో అయితే సాధారణంగా తగ్గు స్వరాలనుండి హెచ్చు స్వరాలకు వెళ్తాయి. పిల్లల ఏడుపులు సరిగ్గా వీటికి సరిపోయాయి. ‘ఎవరి ఏడుపు వారిదే మరి!’ . ఇక తెలుగు భాషలో సాధారణంగా హెచ్చు స్వరాలనుండి తగ్గుస్వరాలకు వస్తాయి. దానికితగ్గట్టే మామనవరాలి ఏడుపు ను గమనించాను. ‘ఉంగా’ అన్నప్పుడు మొదటి అక్షరం హెచ్చు స్వరంతోనూ, రెండవ అక్షరం తగ్గుస్వరంతోనూ పలుకింది. అంటే అప్పుడే పుట్టిన పసిబిడ్డకుకూడా మాతృభాషా జ్ఞానం ఉంటుంది. ఈ విషయాలపై సిగ్మండ్ ఫ్రాయిడ్ కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆయన ప్రకారం బిడ్డ కడుపులో ఉండగానే (ముఖ్యంగా 8,9,10 నెలలలో) మనసు ఏర్పడుతుంది. నిజానికి మన భారతీయులు ఎప్పుడో నాలుగు నెలలు నిండిన గర్భిణిని ‘దౌహృదిని’ (రెండు మనసులు కలది ) అని నిర్ణయించారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం మనిషిలో conscious, unconscious, preconscious స్థితులు ఉంటాయి. ఇవే ed, ego, super ego గా పనిచేస్తాయి (Georg Groddeck ). లోపల మనసునుంచి అనేక ప్రేరణలు కలుగుతాయి. ఇది ed వల్ల జరిగుతాయి. వాటికి అనుగుణంగా చెయ్యమని ego చెబుతుంది. అలా చెయ్యవద్దని చెప్పేదే super ego . వీటిని మనం సత్వరజస్తమో గుణాలుగా చూడవచ్చు (సత్వగుణం - super ego, రజోగుణం - ego, తమోగుణం - ed ) . చంటిపిల్లలు తమోగుణం కలిగినవారు. ఏం అనిపిస్తే అది చేసేస్తారు. యుక్తాయుక్త విచక్షణలేని unconscious స్థితిలో ఉంటారు. ఆస్థితిలోనే తల్లి ఆలోచనలను, సంస్కృతిని, మాటలను మనసుచే ఆకళింపు చేసుకుంటుంది. మూడేళ్ళవరకూ మాతృభాషలోనే మనసు గ్రహిస్తుంది, ఆలోచిస్తుంది. ఆరేళ్ళునిండకుండా స్కూలుకి వెళ్ళినప్పుడు బలవంతంగా ఏకమాధ్యమాన్ని రుద్దితే దాని ప్రభావంచేత guilty conscious ఏర్పడుతుంది. తెలుగులో ఆలోచిస్తూ తప్పుచేశానన్న అపరాధ భావన చే ఆత్మనూన్యతా భావం, అనేక personality disorders . ఇతరభాషలు నేర్చుకోవండంలో తప్పు లేదు ఆరేళ్ళతరువాత అవి నేర్చుకోవచ్చు. అయితే ఈ కార్పరేట్ స్కూల్స్ లో చదివిన వారికి isolation పెరిగి, peer group మధ్య సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి. మన సంస్కృతి నుండే భాష ఏర్పడుతుంది. సంస్కృతికి తగ్గట్టుగా భాషా పదాలు ఉంటాయి. అలా అని చెప్పి సంస్కృతపదాలు పెట్టేసి అది తెలుగు అనడం కూడా సరికాదు.

ఇక ఫ్రాయిడ్ కలల గురించి చెబుతూ, కలలలో వ్యక్తిగత విషయాలే కనిపిస్తుంటాయి, అవి మాతృభాషలోనే ఉంటాయి అని అంటారు. కలలకు కారణాలు, వాటిద్వారా అందే సంకేతాలు మాతృభాష పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక బ్రిటన్ వానికి కలలో పిల్లి కనిపిస్తే there are many ways to peel a cat' అన్న వారి నానుడి ప్రకారం అతను చేయబోయే పని కి ఎన్నో మార్గాలు ఉన్నాయని వాటిని ఆలోచించమని చెప్పినట్టు లెఖ్ఖ అవుతుంది. అదే తెలుగు వాడికి పిల్లి కలలోకొస్తే మన జాతీయాలకి అనుగుణంగా అర్థం ఉంటుంది. (‘పిల్లి కళ్ళుమూసుకు పాలు తాగుతూ ఎవరూ చూడటంలేదు అనుకుంటుంది’ మొదలైనవి). నిజానికి మనసు కేవలం మాతృభాషలో ఉంటుంది. కనుక ధారణ చేస్తే దానిలో చేయాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. అందుకే సైన్సు పాఠాలలో సంస్కృతాన్ని వీడి తెలుగుకు ప్రాధాన్యతనిస్తే సులువుగా ఉంటుంది. ఉదాహరణకి ఫెర్న్ మొక్క యొక్క ‘ circinate vernation ’ అన్న దానికి ‘వలితకిసలయ విన్యాసం’ అని తెలుగు పుస్తకంలో అనువదిస్తే ఉభయభ్రష్టత్వంతప్ప ఉపయోగం ఉండదు. ఈ విధంగా చేయడం వల్లనే తెలుగు మీడియం చదువులు దెబ్బతిన్నాయి. అదే తెలుగులో సరళీకరించి ఉంటే తెలుగు మీడియం మరింత అభివృద్ధి చెంది ఉండేది. పెళ్ళిమంత్రాలు సంస్కృతంలో చదివి ఉపయేగం ఏమిటి. తెలుగులో చెబితే సులభంగా అర్థం మనసుకు తెలుస్తుందికదా! దేవునికి తెలుగురాదనా? మధ్యలో వేరొకరు ఏదో అంటే ‘మమ’ అనుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?
అప్పటి భాషోద్యమాన్ని తీసుకుంటే తెలుగులో వ్రాయడం చిన్నతనంగా భావించేవారు పండితులు. అదే ఈరోజు తెలుగులో మాట్లాడడమే తక్కువగా భావిస్తున్నారు ప్రజలు.

నిజానికి మన తెలుగు భాష యొక్క మూలాలను గురించి చూస్తే, ఇది ద్రవిడ భాషా కుటుంబానికి (ప్రచారంలో ఉన్న పదం) చెందినది. మనదేశంలో ద్రవిడభాషాకుటుంబం, ఇన్డో ఆంగ్లో కుటుంబం, ముండా భాష కుటుంబం, చైనా కుటుంబాలు వున్నాయి. ఈ భాషా విషయాలపై ఎంతోమంది ప్రస్తుతం కృషిచేస్తున్నారు. ముఖ్యంగా Michael Weiss, Werner Winter, Bernard Vincent విశేష కృషి చేస్తున్నారు. F.B.J. Kuiper ఋగ్వేదంలో వేదభాషకు సంబంధంలేని పదాలు మూడువందలు ఉన్నాయని కనుగొన్నారు. మల్లాది సూర్యనారాయణశాస్త్రి గారి సంస్కృతవాఙ్మయ చరిత్రలో వేదభాషగురించి, సంస్కృత భాషగురించి విపులంగా వివరించారు. తెరువాత పరిశోధనలలో సుమారు ఎనిమిది వందలు పదాలు ఇండో యూరోపియన్ భాషకు చెందని పదాలు కనుకున్నారు. ఉదాహరణకి గజ, పతి , కూర్పాసం ఇతర భాషా పదాలు. ఈ పరిశోధనలద్వారా ఈ భాషలకు మూలమైన proto indo european భాషను reconstruct చేశారు. అదేవిధంగా ప్రోటో ద్రవిడియన్ ఫ్యామలీ ని గుర్తించారు. ఇందులో నార్త్ ప్రోటో ద్రవిడ (బ్రాహులి - ఆఫ్గన్లో మాట్లాడే ఒక భాష), సెంట్రల్ ప్రోటో ద్రవిడ (తెలుగు), సౌత్ ప్రోటో ద్రవిడ భాషలు (తమిళ, మళయాళం) ఉన్నాయి. వేదభాషలో ఎక్కువగా నార్త్, సెంట్రల్ ప్రోటో ద్రవిడభాషలనుండి పదాలు కనిపిస్తాయి. సౌత్ ప్రోటో ద్రవిడ భాషలకు సంబంధించిన పదాలు కనపడవు. (ప్రోటో ముండా భాషనుండి కూడా వేదభాషలోకి పదాలు వెళ్ళాయి. ఉదా: వరి అన్నపదం, అసలు ముండా అన్న పదం నుండే ముండనం మొదలైనవి వచ్చాయి.) పై విషయాలను చూస్తే ముందుగా తెలుగే విడివడి ఉండడానికి అవకాశం ఉంది కనుక తెలుగే తమిళంకన్నా ప్రాచీనం కావలసి ఉంది. సంస్కృతం కన్నా తెలుగు ప్రాచీనమా కాదా అన్న విషయాన్ని కూడా పరిశోధించవలసి ఉన్నది.

ఇక పూర్వం ఆర్కియాలజిష్టులు, డక్కన్ ప్రాంతంలో దొరికిన అవశేషాలను సైతము ఇన్డియన్ అని అనేసి వదిలేశారు దానివలన అది సింధునాగరికతకు సంబంధించినదే అన్న అభిప్రాయం ఏర్పడిపోయింది. నిజానికి సింధునాగరికతకు సమాంతరంగా డక్కన్ భూభాగంలోనూ నాగరికత విరాజిల్లింది. ఇనుమును కరిగించగలిగారని కూడా ఆధారాలున్నాయి. మరి ఈ నాగరికతను తెలుగునాగరికత అని ఎందుకు అనరు? ఎందుకు అనలేదు? ఈ విషయమై మేము (కృష్ణా జిల్లా రచయితల సంఘం) సింధు కృష్ణా నాగరికతల సదస్సు ఏర్పాటు చేసి ఆర్కియాలజిష్టులను రప్పించి వాటిపై చర్చను పెట్టి కృష్ణా నగరికతపై ప్రసంగాలు ఇప్పించాము. (ఈ విషయాలు చూస్తే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దండకారణ్యంలోకి వచ్చినతరువాతే అస్త్రాలు ఇవ్వడం, అర్జనుడు ఇక్కడ తపస్సు చేసే పాశుపతాన్ని పొందడం బహుశా ఇక్కడమాత్రమే అటువంటి ఆయుధాలు తయారు చేయగల సామర్ధ్యం ఉన్న నాగరికత ఉండడం వల్లనే నేమో అని సరదాకి అనిపిస్తుంది). రామాయణంలో ఇక్కడి నాగరికతకు సంబంధించిన విశేషాలు కొన్ని కనిపిస్తాయి.
నిజానికి తాళ వృక్షానికి ఆపేరు రావడానికి కారణం, తల పొడవు కనుక వచ్చింది. ఇది తాటి చెట్టుకు పేరు. ఇదే తాటి చెట్టులేని ఇతరప్రాంతాలలో కొబ్బరి మొదలైన పొడవుగా ఉండే చట్లకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే తాటకి తెలుగింటి ఆడపడచు. దీనికి సిగ్గుపడాల్సిన పనిలేదు. చరిత్రని చరిత్రగా చెప్పుకుంటే రాముణ్ణి ఎదిరించినవారు మనవారని మనం గర్వంగా చెప్పవచ్చు. అంతమాత్రం చేత నాస్తికత్వమని తప్పుపట్టనక్కరలేదు.

ఇంకాస్త మీదకి వెళితే ‘చికున్ గునియా’ పై అమెరిగా పరిశోధకులు, అది ముందుగా కనిపించిన సొమాలియాలో పరిశోధనలు చేశారు. ఆ పదం యొక్క పుట్టుక సొమాలియాభాషలో ఉంది. వారి భాషలో ‘కుంగుంన్యాలా’ అంటే క్రుంగిపోయారు అని అర్థం. ‘చీ కుంగుంన్యాలా’ అంటే బాగా క్రుంగిపోయారు అని అర్థం. ఈ వ్యాధికి ఆ లక్షణం ఉంది కనుక వారు అలా పిలిచేవారు. ఇది మనం తెలుగులో ‘కుంగిపోయాడు’ అన్న మాటకు సారూప్యంగా కనిపిస్తుంది. నెల్లూరు యాసలో ‘కుంగున్యాడు’ అని అనడం కద్దు. దీనిబట్టి ఆఫ్రికాలోనీ తెలుగు భాష ఉన్నదని తెలుస్తుంది. ఒక ఉదాహరణకి ఇలా భావించలేకపోవచ్చు, కానీ ఇలాంటివి నూటయాభై ఇప్పటికే కనుగొన్నారు. వీటిని `Makers of Civilization' అనే పుస్తకంలో L.A. Waddell అనే పరిశోధకుడు పొందుపరిచారు.
అతని తన పరిశోధనలలో సుమేరియా నాగరికతనుండి ఆర్యులు వచ్చారని చెబుతూ బాబిలోనియాలో దొరికిన శిలాశాసనాలలో అనేక రాజవంశీకుల కథలు మన పురాణాలలో ఉన్నాయని వివరించారు. నిజానికి క్షత్రియులు అన్న పదం, బాబిలోనియన్లు ఉపయోగించే ‘KaTiTis’ అనే పదంనుండి వచ్చింది. ఇక ఆ పుస్తకంలో రాముడు, సగరుడు, హరిశ్చంద్రుడు, అసమంజసుడు మొదలైన మన పురాణవ్యక్తుల కథలు కనిపిస్తాయి. సగరుని వాళ్ళు సర్గన్ అని పిలుస్తారు. అతని కుమారుడైన అహమినిస్ కథ, సగరుని కుమారుడైన అసమంజసుని కథ పోలి ఉంటుంది. అట్లే నర్సింగ్ అన్న పదం మనిషి ముఖం సింహం శరీరం కలిగిన ప్రాణికి (ఈజిప్టు స్ఫినిక్స్ దేవత లా) వారికి ఉంది. దీనిబట్టి Sumerians are Aryans అనే విషయం తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వచ్చిన నవీన ఆధారాల తో Early Sumerians are Dravidians అని అనవలసి ఉంటుంది. ముఖ్యంగా తెలుగులోని కడవ, కమరచేయు, కలము (పడవ అనే అర్థంలో), చీరుట, ఇసుక, చిలువ, బూది, దొబ్బు, గూడు, కూన, మగ, చాటు, బెల్లం (చిన్నపిల్లాడి పురుషాంగం అర్థంలో) మొదలైన పదాలు ఇంచుమించు అవే అర్థంలో ఆఫ్రికా భాషలో కనిపిస్తాయి. దీనిబట్టి Bernard Sergent అనే అతను ఆఫ్రికా నైలు నాగరికత నుండి సుమేరియా, ఆపై ఇరాన్ మీదుగా ఒక గుంపు మీదకి రెండవ గుంపు సింధు, కృష్ణా నాగరికతలు గా విస్తరించాయని సూత్రీకరించారు. అయితే తాజా పరిశోధనలో ఇరాను నుండి సముద్రమార్గం ద్వారా నేరుగా డక్కన్ లోకి వచ్చారని, ఋగ్వేదకాలానికే డక్కన నాగరికత విలసిల్లుతూ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉదాహరణకి, బాబిలోనియలో ఒక రకం వస్త్రాన్ని సింద్ అనేవారని ఆర్కియాలజిష్టులు అది సింధు నాగరికతనుండి వచ్చింది కాబట్టి ఆపేరు వచ్చిందని నిర్ణయించేశారు. అయితే ఇది సిందురము (రంగు) వస్త్రము కనుక దానికి ఆపేరు వచ్చింది. ఇది బహుశా మన మచిలీ పట్నం ప్రాంతంలో తయారు చేయబడి ఇతరదేశాలకి వెళ్ళింది.

(ప్రసంగానంతరం ప్రశ్నాకార్యక్రమంలో ‘మరి తెలుగు అంత ప్రాచీనమైతే పెళ్ళి మంత్రాలు తెలుగులో కాకుండా సంస్కృతంలోనే ఎందుకు ఉన్నాయి అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.)
మధ్యయుగంలో వచ్చిన మార్పుల చేత సంస్కృతం ప్రబలమయ్యింది కానీ నిజానికి అంతకు ముందు ఇక్కడ తెలుగునాగరికత సంస్కృతి ఉండేవి. ఉదాహరణకి తాళి కట్టడం అనేది ముందు లేదు. తాళి అన్నది తెలుగు పదం. ముస్లిం దండయాత్రల కాలంలో పెళ్ళైయ్యిందనేందుకు చిహ్నంగా తాటి ఆకుతో చేసినది ధరిచడం మొదలుపెట్టారు. అందుకే దానికి తాళి అన్నపేరువచ్చింది. ఆ తరువాత అనేక అన్యాయమైన, వెర్రి మార్పులు చేసి స్త్రీ స్తనముల రూపంలోని మంగళసూత్రాన్ని మొదలెట్టారు, పెళ్ళి తంతుని ఏర్పరిచారు. అంతకుముందు ఈ ప్రాంతంలో ఉండే ఆచార వ్యవహారాలు వేరు.

ఈ ప్రసంగానికి స్పందిస్తూ శ్రీ ఉపాధ్యాయుల నరసింహమూర్తి, శాస్త్రీయ ప్రసంగాన్ని కర్కశంగా కాకుండా సరళంగా చెప్పారు. చెప్పిన విషయాలు, వచ్చిన ఫలితాలు నూటికి నూరుపాళ్ళు సరికాకపోవచ్చు అని ఆయనకూడా ఒప్పుకుంటారు. ఇంకా భాషాసంబంధమైన విషయాలలో పరిశోధనలు ఒక కొలిక్కి రాలేదు. అయితే తెలుగువారి ఉనికిని, స్థితిని గుర్తించడానికి వక్త చేస్తున్న కృషి అభినందనీయం. ఈత్రోవలో ఆయన మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నను. ఎందుకంటే ఇప్పుడు ఎదుర్కోవలసింది వ్యాపారప్రాబల్యాన్ని, రాజకీయ ప్రాబల్యాన్ని కాదు సాంస్కృతిక ప్రాబల్యాన్ని. ఇది చాలా కష్టమైన పని. దీనికి ఉదాహరణ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ యొక్క దయనీయస్థితి. తెలుగు భాషకి నిజానికి కార్పరేట్ స్కూళ్ళకంటే, తల్లి దండ్రులే పెద్ద అడ్డంకిగా ఉన్నారు. ఇది తన ప్రత్యక్షంగా చూసిన నిజం అంటూ వక్తని అభినందిస్తూ ముగించారు.
చివరగా వందనసమర్పణ శ్రీ కె. శారదా ప్రసాద్ చేశారు.

26, నవంబర్ 2009, గురువారం

మూడువందల యాభైమూడవ సభ

తెలుగు వెలుగు

అధ్యక్షులు : శ్రీ ఎం. సుధాకర్
(ప్రొ|| శ్రీకృష్ణా బజాజ్, విజయనగరం)
వక్త : డా|| జి. వి. పూర్ణచందు
(తెలుగు భాషోద్యమ ప్రముఖులు, ప్రధాన కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితల సంఘం, విజయవాడ)
విషయం : తెలుగుభాషా ప్రాచీనత - నూతన పరిశోధనాంశాలు
సమ్మానకర్త : కుమారి అడిదం ఇందిరాంబ
(సహాయ కార్యదర్శి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 29-11-2009 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

మూడువందల యాభైరెండవ సభ

(నలభైరెండవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా)

తెలుగు లెంక - శ్రీ తుమ్మల

అధ్యక్షులు : శ్రీ రావి- ఎన్. అవధాని
(అధ్యక్షులు, విజయభావన)
వక్త : శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్
(కార్యదర్శి, విజయభావన)
విషయం : తుమ్మల కవితా వైభవం

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 15-11-2009 ఆదివారం సా|| గం|| 6.00 ని||లకు

గమనిక : వక్త తన ప్రసంగసారాన్ని వ్యాస రూపంలో padyam.net లో పొందుపరిచారు.

19, అక్టోబర్ 2009, సోమవారం

మూడువందల యాభైయ్యొకటవ సభ

నవలా విలాసం

అధ్యక్షులు : శ్రీ అవనాపు సూరిబాబు
(మున్సిపల్ ఛైర్మన్, విజయనగరం)
వక్త : శ్రీ నండూరి రాజగోపాల్
(`చినుకు ' సంపాదకులు, విజయవాడ)
విషయం : ఇప్పటికీ గోపీచంద్ నవలలు అవసరమా!
సమ్మానకర్త : శ్రీ కె. కృష్ణమూర్తి. బి.కాం, బి.ఎల్
(ప్రముఖ న్యాయవాది)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం: తే 25-10-2009 ఆదివారం సా గం 6.30 నిలకు

29, సెప్టెంబర్ 2009, మంగళవారం

హైకూ అందాలు

‘రెండు రెక్కలు
నింగిలో స్వప్నలిపి
హైకూ విహంగం !’
- పెన్నా శివరామకృష్ణ

విజయభావన మూడువందల యాభైయ్యవ సభకు ఆహ్వానం పలుకుతూ నగరంలో ఉత్సవ వైభవం అందగిస్తున్న సమయంలో విజయభావన విజయోత్సవం జరగడం ఆనందదాయకంగా ఉందని, వచ్చినవారందరికీ దసరా సుభాకాంక్షలు తెలియజేశారు. సభాధ్యక్షులు శ్రీ ఎన్. ఆర్. శ్రీనివాసరావుగారిని పరిచయం చేస్తూ, ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక, సాహిత్య సేవను కొనియాడారు. కానుకుర్తి నరసింగరావు ట్రస్టు ద్వారా ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. సమ్మానకర్త శ్రీ రావి. ఎన్. అవధాని గారిని పరిచయం చేస్తూ, కథ, నవల, నాటక రచయితగా ఆయన సుపరిచితులని, ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఆయన విజయభావన అధ్యక్షులుగా ఉండడం విజయభావనకు గర్వకారణం అని కీర్తించారు. వక్త శ్రీ రెంటాల వేంకటేశ్వర రావుగారిని పరిచయంచేస్తూ, సాహితీ విమర్శకులలో ఆయనది విశిష్టస్థానం అని, ఆయన హాస్య రచనలు, అవగాహన అనే వ్యాస సంకలనం పాఠకుల ప్రశంసలు పొందాయని తెలిపారు. ఆయన గజల్స్ పాడటంలో కూడా ప్రావీణ్యం ఉందని, తమ మొదటి పరిచయం దాని ద్వారానే జరిగిందని గుర్తుచేసుకున్నారు.
అనంతరం శ్రీమతి వెల్ల సరోజినిగారు ప్రార్థన చేశారు.
సభాధ్యక్షులవారు మాట్లాడుతూ, విజయభావనలోని మిత్రుల ప్రోద్బలమే తనను అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టినదని తెలిపారు. ఆచార్య భావన్ గారు నాటిన విత్తనం పెరిగి వృక్షమై నేటికి ఫలాలను అందిస్తోందని విజయభావన సంస్థను కొనియాడారు. సభ్యులు ఎంతో కష్టనష్టాలకోర్చి సంస్థను నడుపుతున్నారని, వారికి అందరూ సహాయ సహకారాలందించాలని, మరింత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. భాషాదురభిమానానికి పోకుండా భాష, సంస్కృతి అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. సంస్థకు తన సహాయం ఎల్లెప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
సమ్మానకర్త మాట్లాడుతూ విజయభావన రజతోత్సవ సందర్భంగా ప్రత్యేక సంచిక రాబోతోందని, దానికి సహాయ సహకారాలందించాలని కోరారు.
సన్మానానంతరం వక్త శ్రీ రెంటాల వేంకటేశ్వరరావుగారి ప్రసంగించారు. అందులో కొన్ని వివరాలు : హైకూ అంత అపార్థానికి గురియైన కవితా ప్రక్రియ ఇంకొకటిలేదు. విమర్శకుల వ్యాసాలు, కవుల పుస్తకాలు చదివిన మీదట ఈ అభిప్రాయానికి వచ్చానన్నారు. హైకూ మీద మాట్లాడాలని అనుకోవడానికి ప్రధాన కారణంగా దీనిని చెప్పారు.
హైకూ తెలుగులో కొద్దిగానైనా నిలదొక్కుకోవడానికి కారణం శ్రీ ఇస్మైల్ గారని ఆయనని గుర్తు చేసుకున్నారు. హైకూకి ప్రాధాన్యమనవి మౌనం, ఏకాంతం, ధ్యానం, నిశ్శబ్దం అని వివరించారు. నిజానికి దానిగురించి మాట్లాడడం అంటే దానిని కలుషితం చేయడమే అని ఒక సంఘటనని తెలిపారు. ఒక సాహిత్య సభలో హైకూ మీద ప్రసంగం ఉంది రమ్మని ఇస్మైల్‍గారిని ఆహ్వానించగా ఆయన జవాబుగా ‘మనం ఒక గంట కలిసి మౌనంగా కూర్చుందాం!’ అని పంపారు. హైకూ అనేది జపాన్ దేశంలో జన్మించిందని, జెన్ బౌద్ధమతం యొక్క ప్రభావం దీనిపై సంపూర్ణంగా ఉందని తెలిపారు. ధ్యానం అన్న పదం రూపాంతరం చెంది జెన్ అయ్యిందని దీనికి హైకూకీ చాలా లోతైన సంబంధం ఉందన్నారు. హైకూ మూడు పంక్తుల కవితారూపమని, పదిహేడు అక్షరాలు కలిగి ఉంటుందని చెప్పారు. బౌద్ధల నమ్మకం ప్రకారం ఒక అనుభూతి పదిహేడు క్షణాల కన్నా ఎక్కువ ఉండదని అందువల్ల హైకూ పదిహేడు అక్షరాలకు ( 5,7,5 ) పరిమితం చేశారని అన్నారు. అయితే జపనీస్‍లో ఏకాక్షర పదాలు ఎక్కువ కనుక అది సాధ్యమని తెలుగులో ఇది చాలా కష్టమని కేవలం క్రొద్దిమంది మాత్రమే చేశారని, మిగిలినవారు ఆది పాటించటంలేదని తెలిపారు. ఆంగ్లంలో కూడా దీనిని సాధారణంగా పాటించరని తెలుపుతూ ఆంగ్లంలో హైకూ పై ప్రత్యేకమైన పుస్తకాలు, క్లబ్బులు కూడా ఉన్నాయని, తెలుగులో దీనికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వటంలేదని పేర్కొన్నారు. ఇదొక విదేశీ ప్రక్రియగా చూసి వ్యతిరేకించకూడదని అన్నారు. నిజానికి హైకూ రూప ప్రధానమైనది కాదని, సార ప్రధానమైనదని ఆటవెలది, తేటగీతి వంటివి రూపప్రధానమైనవని, వాటికి ఏభావనైనా తీసుకోవచ్చని, హైకూకి అది కుదరదని తెలిపారు. మనం ప్రపంచాన్ని, ప్రాధమిక, ద్వితీయ అనే రెండిటి క్రింద భావించవచ్చు. ద్వితీయ ప్రపంచంలో మానవుడు తాను నిర్మించుకున్న వ్యవస్థ, నాగరికత, ఆర్థిక,సామాజిక, విద్య, పాలన, యంత్ర మొ|| వాటి జ్ఞానం తో నిండింది. ప్రస్తుతం దీని పై దృష్టే ఎక్కువగా ఉంది.
ఇక మొదటిది ప్రాథమికమైనది ఐన ప్రపంచం లో ప్రకృతి, వాతావరణ స్థితి, జీవన వ్యవస్థ మొ|| వి ఉన్నవి. హైకూ ఈ ప్రపంచానికి చెందినది. ద్వితీయ ప్రపంచ దృష్టితో హైకూని చూడటం కానీ, హైకూని వ్రాయటం కాని సరియైన పద్ధతి కాదు. దీనికి ఉదాహరణగా, ప్రత్యేకమైన త్రీ.డి కార్డ్స్ ను చెప్పారు. ఆ కార్డుని మామూలుగా చూస్తే గజిబిజి గా కనిపిస్తుంది. కనులకు కొంచం దూరంలో పెట్టి ఏకాగ్రతతో చూస్తే కొంత సేపటికి అందులో దాగిన చిత్రాలు కనిపిస్తాయి. హైకూని కూడా అలాగే చూడాలని సూచించారు.
హైకూ లో సామాజిక స్పృహ లేదని, అవి పలాయనవాదుల కవిత్వం అని విమర్శ ఉందని, ఇది కూడా సరియైన దృక్కోణంకాదని అన్నారు. మానుషుల మనసుల్లో, డార్విన్, మార్క్స్ సిద్ధాంతాలు, భావనలు బాగానాటుకు పోయాయని, తద్వారా పోరాటమే జీవనమని, పోరాటాన్ని సమర్థించనివాడు పలాయనవాది అన్న అపోహ కలుగుతోందని అదే హైకూ మీద అపప్రదకు కారణం అని అన్నారు. నిజానికి హైకూ ద్వారా విశ్వ సమన్వయాన్ని, ప్రేమని, అంతర్లీన సూత్రాన్ని చూపించవచ్చని తెలిపారు. హైకూ జీవించడానికి కావలిసిన పరిస్థితుల గూర్చి చెప్పదని, జీవించడం ఎలాగో నేర్పే కవిత్వం అని అన్నారు.
ఉదాహరణగా పర్యావరణ పరిరక్షణకై చేసే ఉద్యమాలు, వ్రాసే కవిత్వం వెనుకాల మనిషి స్వార్థం దాగి ఉందని అయితే హైకూలో కేవలం ప్రాకృతిక స్పృహ కనిపిస్తుందని ఒక హైకూని ఉదహరించారు.
‘అదో పిచ్చి మొక్క
అనబోయి
నా గురించి తనేమనుకుంటోందో!!’
ప్రతీ వస్తువుకూ స్వంత అస్థిత్వం ఉంటుందని హైకూ చూపిస్తుందన్నారు.

‘ఎవరూ తెలియని
మరో ఊరు
నాకునేనే క్రొత్తగా !!’
- మనిషి అనుభవానికి అక్షరరూపంగా ఉదహరించిన హైకూ.


‘గుడి మంటపం
పడుకుని బికారి
ఎంత స్వేచ్ఛ !’
- స్వేచ్ఛను సరళంగా సూచించే హైకూ.

‘అతిథిగా జీవితం
బాగుంది
ఇంటికెళ్ళి దీనిని సాధన చెయ్యాలి!’
- తామరాకు మీద నీటి బొట్టు తత్వాన్ని సూచించే హైకూ.

‘ఆహారం
కృతజ్ఞతతో తీసుకుంటే
మనసుకూడా నిండింది!’
- ఆహారాన్ని ఆస్వాదిస్తూ, తనలో భాగమై తనను శక్తివంతుని చేస్తున్నందుకు కృతజ్ఞత చూపాలని తెలిపేహైకూ.

‘దూరం నుంచి
ఓ అమ్మాయి సమీపించి
క్రమంగా దూరంలోకి అదృశ్యమైపోయింది!’
- స్థిమితమైన స్థితిని చూపిస్తోంది. దృశ్యంలో తాను ఉన్నా దానికి అతీతమైన స్థితిలోకి వెళ్ళడం.

‘జ్వరంతో మంచం మీద
ఎంత విముక్తి
వేటి వేటి నుంచో!’
- ఒక నిశ్చింత, ఆదుర్దా, కంగారులేని స్థితి. చేయగలిగేది తన చేతులో లేదు అన్న భావన ఇచ్చే ప్రశాంతత.

‘ధాన్య రాశుల కాపలాదారు
గింజలేరుకుంటున్న
పిచుకను చూస్తున్నాడు!’
- ఒక దృశ్యాన్ని, కాపలాదారు మనసుని చూపిస్తుంది

‘గుడి
పక్షులు, పిల్లలు దేవుడు
ఒంటరి పూజారి!’
- సహజజ్ఞానానికి ప్రతీకలైన పక్షులు, పిల్లలు. తానే సహజ జ్ఞానమైన దేవుడు, తర్క స్థాయిలో ఉన్న పూజారిని సూచిస్తుంది.

వీటిని వివరిస్తూ, హైకూ ని తెలియాలంటే కవి ఎంత కవో, పాఠకుడు కూడా అంత కవి అవ్వాలని అన్నారు.
ముఖ్యంగా హైకూలో కనిపించేవి, మిగతా ప్రక్రియలలో అంతగా కనపడనివి మూడు ఉన్నాయని అన్నారు. అవి సతోరీ, అవారే, మియాది అనేవి. వాటిని వివరిస్తూ మరికొన్ని హైకూలు ఉదహరించారు.
సతోరీ - మామూలు జ్ఞానానికి అతీతమైన స్ఫురణ. ఇక్కడ బుద్ధికి కాక కేవలం హృదయానికే ప్రాధాన్యం ఉంటుంది.

‘దూరంగా దీపం
దానిని కాపాడుతూ
చుట్టూ చీకటి!’

‘అనాథ బాలిక
జాలి దానం చేసి
వెళ్ళిపోతోంది!’

‘నాతో చదివింది
ఆ అమ్మాయి
పెద్దవాళ్ళమైపోయాం!’

‘పంజరం
ఖాళీగా ఉంది
ప్రేమంటే తెలిసిందేమో!’

‘పసివాడితో వస్తే
పాతబజారే
ఎంత కొత్తగా ఉంది!’

అవారే - ఒకరకమైన దిగులుని సూచిస్తుంది. వస్తువలపై ప్రేమ, నశ్వరమైన జీవితం మొదలైన విషయాలు కనిపిస్తాయి.

‘వేసవి మధ్యాహ్నం
వృద్ధ యాచకురాలు
ఇవాళ రాలేదు!’

‘వంతన వేశారు
కాలువ ఒక గట్టున
ఊగుతూ బల్లకట్టు!’

‘ఒంటరిగా రోదిస్తూ
అతనెవరో
ఓదార్చనా వద్దా!’

‘తోటలో
రాలిన పూవుకు తెలియదు
తెల్లవారిందని!’

‘కూలిన గోడమీద
రాబందు
నిశ్శబ్దం బరువెక్కింది!’

మియాది - సున్నితమైన అనుభూతిని పట్టుకోవడం

‘చలి రాత్రి
తల్లి బిడ్డల్ని
చూస్తేనే వెచ్చదనం!’

‘రాలిన చినుకు
ఆకాశం వైపు
ఎగిరింది బెంగతో!’

‘నెలలపాపతో
తల్లి కబుర్లు
దీనిని మించిన ప్రేమకావ్యం రాలేదు!’

‘మళ్ళీ గుమ్మంలో
అమాయకంగా
మేం వదిలివచ్చిన పిల్లి!’

‘బస్సు దిగి
బల్లకట్టెక్కాక
కాలానికి కుదురొచ్చింది!’

కొన్ని సరదా హైకూలను కూడా వినిపించారు.

‘కంటి కొసకి మాత్రమే
కనిపించేవి
ఎలక!’

‘సరదాగా కొలిచా
ఇంటికీ బడికీ దూరం
బడే దూరం!’

‘బాల్చీలో చంద్రుడు
మోసుకుపోయి
ఇంట్లో దాచేసుకోనా!’

‘పిల్ల శాస్త్రజ్ఞుడు
భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టాడు
గిర్రున తిరిగుతూ!’

‘ మేకపిల్ల
నా ఇంటి తలుపు తట్టి
నువ్వెవ్వరని చూసింది!’

‘బొమ్మ గీస్తానంటూ
పసివాడు
ఒక గొప్ప చిత్రంలో కూర్చున్నాడు!’

‘బుద్ధుని ప్రతిమ
చెక్కినప్పుడైనా
శబ్దం వచ్చిందా?!’

‘పాపాయి
యాచకునికి
చేతులందిస్తోంది నవ్వుతూ!’

ఇక ప్రతీ సాహిత్య ప్రక్రియకూ ఉండే అన్ని ప్రయోజనాలు హైకూవల్ల కూడా సాధ్యమని. అంతకు మించిన మానసిక ప్రశాంతత దీనిద్వారా పొందవచ్చని ఇది తన స్వానుభవమని , ఎన్నో నిదర్శనాలు కూడా తనకు తెలుసునని తెలిపారు.
హైకూని ఆస్వాదించాలంటే ఒక పదినిమిషాలు ధ్యానంలో ఉండి ఆలోచనలను తగ్గించుకుని హైకూని చదివితే ఆ అనుభూతి మనకు దొరుకుతుందని. అదేవిధంగా ఒకటిరెండు చదివినంతమాత్రాన హైకూతత్వం గ్రహించడం కష్టమని, వానచినుకులు ఒకటి రెండు పడితే అది వాన అవ్వదని తెలిపారు. హైకూని అందరూ ఆదరించాలని అది మన జీవితాన్ని ఆనందమయం చేస్తుందని సూచించారు.
చివరగా సంస్థ కార్యదర్శి శ్రీ జక్కు రామకృష్ణగారు వందన సమర్పణ చేశారు.

19, సెప్టెంబర్ 2009, శనివారం

మూడువందల యాభైయ్యవ సభ

హైకూ అందాలు

అధ్యక్షులు : శ్రీ ఎన్. ఆర్. శ్రీనివాసరావు
(కార్యదర్శి, కె. ఎల్. నరసింగరావు మెమోరియల్ సొసైటి, విజయనగరం)
వక్త : శ్రీ రెంటాల వేంకటేశ్వరరావు, ఎం.ఎ;పిహెచ్.డి
(ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్. కోట)
విషయం : హైకూ కవిత్వం
సమ్మానకర్త : శ్రీ రావి. ఎన్. అవధాని
(అధ్యక్షులు, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 27-09-2009 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

మూడువందల ముప్ఫైతొమ్మిదవ సభ

బాలభారతి

స్థానిక గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విజయభావన మూడువందల ముప్ఫైతొమ్మిదవ సభలో విజయనగరంజిల్లాలో బాలసాహిత్యం తీరుతెన్నులపై సాలూరుకుచెందిన రచయిత కిలపర్తి దాలినాయుడుగారు ప్రసంగించారు.
బాల సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సభకు బగ్గం రామజోగారావుగారు అధ్యక్షత వహిస్తూ సాహిత్యంలో విజయభావన చేసిన కృషిని ప్రశంసించారు. విజయభావన సహాయకార్యదర్శి శ్రీమతి ఎ. లలితా శంకర్ గారు సమ్మానకర్తగా వ్యవహరించారు. ప్రధాన కార్యదర్శి డా|| ఎ. గోపాలరావు గారు స్వాగత వచనాలు పలికి అతిథుల్ని సభకు పరిచయంచేశారు. దాలినాయుడుగారు బాలసాహిత్యానికి వివిధ స్థాయిలలో చేస్తున్న కృషి, ఆయన పొందిన పురస్కారాలు తెలిపి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన దాలినాయుడుగారి ప్రసంగంలో కొన్ని ముఖ్య అంశాలు:
పద్ధెనిమిదవ శతాబ్దం తరువాత ముద్రణలోకి అనేక బాల కథలు వచ్చాయి.
పొడుపుకథలు, దేశభక్తి, వీరగాథలు వంటి ఎన్నో అంశాలు బాలసాహిత్యం పాటలద్వారా పిల్లలలో ఆసక్తి రేపి సమాజ శ్రేయస్సు కోసం పాటు పడేలా చేసింది.
ఏవిధంగా అయితే పాలు సంపూర్ణ ఆహారంగా పిల్లలకు ఉపయోగ పడుతుందో అదేవిధంగా బాలసాహిత్యం పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడుతుంది.
పాత చందమామల దగ్గరనుండీ నేటి నాని పత్రిక వరకూ బాల సాహిత్యంలో సృజనాత్మతకు అద్దం పడుతున్నాయి.
జిల్లాలోని బాల సాహిత్యం గురించి మాట్లాడుతూ ఈ జిల్లాలోనే ఎక్కువ కృషి జరిగిందని తెలిపారు. గురజాడ వంటి మహాకవులదగ్గరనుండి నేటి తరంలో ఎ.బి సుబ్బారావు, రఘునందం మొదలైనవారి వరకూ అనేకమంది ఇందులో కృషిచేస్తున్నారని అన్నారు.
ఉదాహరణగా కొన్ని కథలు, పాటలు వినిపించారు.
పార్వతీపురానికి చెందిన బి. వి. పట్నాయక్ గారు వ్రాసిన రాజు-విగ్రహం అనే కథ ద్వారా మంచిపనులు చేయవలెనని సూచించారని తెలిపారు. ఒక రాజుగారు తన విగ్రహాలని స్థాపించాలని ఆలోచించి మంత్రిగారితో చర్చించారు. ఒకనాడు ఆ మంత్రి, రాజు ఉద్యానవనంలో విహరిస్తుండగా కాకి రాజుగారి మీద రెట్టవెసిపోయింది. అది తుడుచుకున్న తరువాత రాజుగారికి తన విగ్రహం పెడితే ఎన్నోకాకులు ఇలా రెట్టలు వేస్తూ ఉంటాయి. మరి తుడిచేవారెవరు అన్న అనుమానం వచ్చింది. చివరకు మంత్రిగారి సలహామీద పేరు నిలవాలంటే విగ్రహాలు నిలబెట్టడంకన్నా మంచిపనులు చేయవలెనని గుర్తించి ఆవిధంగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
పాటల ద్వారా సైన్సు పాఠాలను కూడా చెప్పవచ్చని తెలుపుతూ తను వ్రాసిన ఎందుకని - ఎందుకని అనే గేయాన్ని వినిపించారు.
ఎందుకని -ఎందుకని
దీపం నిత్యం పైకే కాలును ఎందుకని - ఎందుకని
అలాగే గణిత పాఠాలు నేర్పవచ్చన్నారు.
తెలుగు చక్కగా రావడానికి బలసాహిత్యం తిరుగులేని మాధ్యమం అని అన్నారు. అక్షరాలు పలకడం అలవాటు కావడానికి, ఒకే అక్షరం ఎక్కువసార్లు ఉపయోగిస్తూ పాటలు వ్రాయవచ్చని సోదాహరణంగా వివరించారు.
ఇక వ్యక్తిత్వవికాసానికి సంబంధించి పాము కథని వినిపించారు. ఒక ముని పాముని సాధుజీవిగామారమని, కాటు వేయడం మానుకోమని ఉపదేశించి వెళ్ళిపోవును. ఆ పాము ఆ విధంగా జీవించడం మొదలుపెట్టింది. ఎవరు ఏంచేసినా ఎదురుతిరగకుండా ఉండేది. దానితో అందరూ రాళ్ళు వేస్తూ దానిని బాధించాసాగారు. అయినా అది అలాగే ఉంది. కొన్నాళ్ళకి ఆ ముని మరల వచ్చి పాము దీనస్థితిని చూశాడు. ఏమయ్యిందని అడిగితే మహాత్మా మీరు సాధుజీవిగా ఉండమన్నారు దాని ఫలితమే ఈ దెబ్బలు అని అన్నది. అది విని సాధువు నేను కాటు వేయవద్దన్నాను కానీ బుస కొట్టవద్దనలేదు కదా! నీ ఆత్మరక్షణకు నీవు బుస కొట్టాలి. లేనిచో బ్రతుకు కష్టమగుని అని హితవు పలికెను. ఆ తరువాత పాము ఆ విధంగా చేస్తూ హాయిగా జీవించింది.
అదేవిధంగా చెడ్డవాళ్ళతో స్నేహం మంచిదికాదని చెప్పే నక్క, సింహం కథ ఉదహరించారు. ఒక అడవిలో సింహంతో సహా అన్ని ప్రాణులూ శాఖాహారులై కలసి మెలసి జీవించేవి. ఒక నాడు ఒక నక్క ఎక్కడినుండో వచ్చింది. ఇక్కడి పరిస్థితి గమనించింది. మాంసం తినాలనే కోరికతో అది సింహంతో స్నేహంచేసి జంతువులను తినవలెనని బోధ మొదలెట్టింది. ఇది గ్రహించిన సింహం దానిని కనపడ వద్దని పంపివేసింది. ఆ నక్క మెల్లిగా సింహం పిల్ల దగ్గర చేరింది. సింహంలేని సమయంలో సింహంపిల్లకు ఒక కుందేలుని చంపి మాంసంరుచి చూపించింది. కొంత అలవాటు చేసినతరువాత ఇక తను మాంసం ఇవ్వలేనని సింహాన్నే అడగమని పురిగొల్పింది. సింహం పిల్ల తండ్రి దగ్గర మాంసంకావాలని గోల చేసింది. ఈ కోరిక పుట్టడానికి వెనుకాల వేరే ఎవరో ఉండి ఉంటారని పసిగట్టిన సింహం ఆరా తీసి నక్క పని అని కనుక్కుని మళ్ళీ ఈ అడవికి వస్తే తాను తినబోయే మొదటి జంతువు ఆ నక్కే అవుతుందని హెచ్చరించి దానిని తరిమికొట్టింది. సింహం పిల్లను మంచి మాటలతో బోధచేసి, చెడు సావాసాలకు దూరంగా ఉండాలని హితవు చెప్పింది.
అలాగే పిల్లచే కథలు, కవితలు వ్రాయించిన వారిలోని సృజనాత్మకత మరింత మెరుగుపడుతుందని అన్నారు. ఉదాహరణగా పాలు, డోలు, మేలు మొదలైన పదాలు ఇచ్చి వాక్యం చివర ఇవి వచ్చేలా వ్రాయమని అన్నప్పుడు,
ఆవు ఇచ్చును తెల్లని పాలు
ఆవు మెడలో గంగడోలు
ఆవు చేయును ప్రజలకు మేలు .. అంటూ ఒక చిన్న పిల్ల వ్రాసిన కవితలో గంగడోలు అన్న పదం మామూలుగా ఎవరికీ తెలియదని. దానిని అక్కడ వాడడంలో ఆ చిన్నారి చూపిన నేర్పు అభినందనీయమని కొనియాడారు.
ఆపైన ప్రభుత్వం బాలసాహిత్యానికి చేస్తున్నకృషిని కూడా వినరించారు.
బాలలవాణి అనే సంస్థద్వారా ప్రభుత్వం పిల్లల ప్రచురణల కార్యక్రమం చేపట్టిందని, డైట్ ప్రముఖులు ఆధ్వర్యంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందిపబడ్డాయని తెలిపారు. ఈ పిల్లల రచనలలో సుమారు ఇరవైఆరువేల బాలల రచనలు ఒక్క విజయనగరం జిల్లానుండే అందాయని. ఇది ఇక్కడి ఉపాధ్యాయుల కృషి ఫలితమని శ్లాఘించారు. శ్రీ శాంతిస్వరూప్ గారి సంపాదకత్వంలో పుస్తకాలు కూర్చబడి, జోనల్ వారీ గా పాఠశాలలకు ఈ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు.
కార్టూనిష్టుగా ఉన్న తను బాలసాహిత్యం పై ఆకర్షితుడనై ఈ రంగంలో కృషిచేస్తున్నాని తెలిపారు.

13, ఆగస్టు 2009, గురువారం

బాలభారతి

మూడువందల నలభైతొమ్మిదవ సభ

బాలభారతి

అధ్యక్షులు : శ్రీ బగ్గాం రామజోగారావు
(విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, ప్రభుత్వ జూనియర్ కలాశాల గజపతినగరం)
వక్త : శ్రీ కిలపర్తి దాలినాయుడు
(ఉపాధ్యాయులు, సాలూరు)
విషయం : విజయనగరం జిల్లాలో బాలసాహిత్యం తీరుతెన్నులు
సమ్మానకర్త : శ్రీమతి ఎ. లలితాశంకర్
(సహాయకార్యదర్శి, విజయభావన)

వేదిక : గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే|| 30-08-2009 ఆదివారం సా|| గం|| 6.30 ని||లకు

6, ఆగస్టు 2009, గురువారం

రామకృష్ణుని కవితారామణీయకం

విజయభావన మూడువందల నలభైఎనిమిదవసభ, స్థానిక గురజాడస్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరంలో ఆదివారం సాయిత్రం జరిగింది. రామకృష్ణుని కవితారామణీయకం అనే అంశంపై సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కలాశాల ఆంధ్రోపన్యాసకురాలు డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి గారి ఉపన్యాసం ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసింది. ఆ వివరాలు :
ముందుగా డాక్టర్ ఎ. గోపాలరావుగారు సభకు స్వాగతం పలికి, అతిథుల్ని పరిచయం చేశారు. శ్రీమతి వెల్లసరోజిని గారు ప్రార్థన చేశారు. సభకు శ్రీమతి భోగరాజు సూర్యలక్ష్మిగారు అధ్యక్షత వహించారు. ఆమె తన ప్రసంగంలో విజయభావన సంస్థ చేస్తున్న సాహితీ సేవను కొనియాడారు. అనంతరం వక్తను సంస్థ కార్యదర్శి శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాష్ శాలువతో, జ్ఞాపికతో సమ్మానించారు. సమ్మానకర్త శ్రీమతి దేవీప్రకాష్ గారు మాట్లాడుతూ, భక్తి టి.వి లో తులసి కార్యక్రమంలో స్త్రీసూక్తం ద్వారా శ్రీమతి అనంతలక్ష్మిగారు ఎంతోమంది చారిత్రిక, పౌరాణిక స్త్రీ మూర్తులను పరిచయంచేస్తున్నారని కొనియాడారు. భారత భారతి అనే జాతీయసమైక్యతా రూపకాన్ని తయారుచేసి అందులో కలభాషిణి అనే పాత్రను కూడా పోషించారని వక్తను అభినందించారు. అనంతరం శ్రీమతి అనంతలక్ష్మిగారు ప్రసంగించారు. శ్రీ పంతుల దక్షిణామూర్తి ప్రసాద్ వందనసమర్పణ చేశారు.

శ్రీమతి అనంతలక్ష్మి గారి ప్రసంగంలోని కొన్ని అంశాలు :

భవిష్యత్తులో ఉపయోగపడేట్లుగా ఉండేదే సాహిత్యము. భవిష్యత్కాలాన్ని అంతర్నేత్రంతో దర్శించగలవాడే కవి, అటువంటివారిలో తెనాలి రామకృష్ణుడు ఒకరు. సార్వకాలికమైన విలువలు కలిగిన సాహిత్యరచనలు చేసిన రామలింగడు తన రచనలలోని విషయాలను శాస్త్రంతో అన్వయించి చూపాడు.

పాండురంగమహాత్మ్యం భావగుంభనమైన కావ్యము. అతని లింగపురాణం, కందర్పకేతు విలాసం గ్రంథాలు లభ్యంకావడంలేదు. అతని హాస్యం సున్నితం, సునిశితం, గంభీరం, ఉదాత్తమైనది.


రాధాకృష్ణుల భక్తుడైన చైతన్య స్వామిని అనుసరించి రాధాకృష్ణుల భజనలు చేస్తూ తిరిగాడు, అందుకనే రాధాదేవి ప్రేమతత్వాన్ని తన పాండురంగ మాహాత్మ్యంలో వ్రాశాడు. రాధాదేవి కృష్ణునికై చేసిన తపస్సు ఫలించుటచే అన్ని ఋతువులలోనూ చెట్లు చిగురించాయి. మనసు మోడై, ఆశలు చిగురించని స్థితికి చేరుకోవడమే నిజమైన తపస్సు. ఆవిధంగా తపస్సు చేసిన పార్వతి 'అపర్ణ' అయ్యింది. అదేవిధంగా తపస్సు చేసిన రాధ కృష్ణునిలో ఐక్యం అయ్యింది.
అతని కావ్యంలోని ఋతు వర్ణన అతని ప్రౌఢతను చాటి చెబుతుంది, కాళిదాసు తో సమానంగా పదబంధాలు వాడారు. సంస్కృతంలో మహాకవి కాళిదాసు పుంభావ సరస్వతి అయితే, తెలుగులో తెనాలి రామకృష్ణుడు పుంభావ సరస్వతి. అతని కున్న వికటకవి బిరుదు పరిహాసం కాదు అందమైనదని, సరళమైనది.

అతని ఇంటి పేరు గారపాటి వారు. తెనాలిలో స్థిరపడడం వల్ల తెనాలి ఇంటి పేరుగా మారింది.
చైతన్య మహాప్రభు భక్తి తత్వ ప్రభావం వల్ల తెలుగులో విఠలాగమం అనే గ్రంథాన్ని పరిచయం చేశాడు, దురాచారాలను ఖండించాడు.
వైష్ణవులు, శైవులు, శాక్తేయులు ఒకటేనని, భక్తి జ్ఞాన కర్మ యోగాలు మూడింటిని తన ఉద్భటారాధ్య చరిత్ర లో చక్కగా విపులీకరించాడు. మంత్ర హఠ రాజయోగాలను వివరించిన తీరు ప్రశంసనీయం.
అతను స్త్రీ పాత్రలను చాలా ఉదాత్తంగా చిత్రించాడు, స్త్రీలను చులకనగా చూస్తే ఏమి జరుగుతుందో చెప్పాడు. నిగమశర్మ అక్క చాతుర్యాన్ని, అతని భార్య సౌశీల్యాన్ని చక్కగా తెలిపాడు. పడు పడుకకు తెలియకుండ నిగమశర్మ ఇల్లు దోచుకొని పోయినప్పుడు, నిగమశర్మ అక్క తన ముక్కెర పోయినందుకే దుఃఖించినట్లుగా చెప్పడం, రామకృష్ణుని హాస్యచతురతకు నిదర్శనంగా చెబుతారు. అయితే అది సరికాదు. ఆమె తన ఐదవతనానికి ఒక చిహ్నమైన ఆభరణాన్ని తీసుకు వెళ్ళినందుకు విచారించింది. ఒక సంప్రదాయానికి విఘాతం కలిగినందుకు బాధపడింది.

తెనాలి రామకృష్ణుడు భారతీయ సమాజంలో, స్త్రీలకు ఉన్న ఉన్నత స్థానం గురించి తెలియజేశాడని ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.

12, జులై 2009, ఆదివారం

పాండురంగ సుకవి పద్యంపు హరువు

మూడువందల నలభైయ్యెనిమిదవ సభ

పాండురంగ సుకవి పద్యంపు హరువు

అధ్యక్షులు : శ్రీమతి భోగరాజు సూర్యలక్ష్మి
(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఫోర్టు బ్రాంచ్), విజయనగరం)
వక్త : డా|| ఎన్. అనంతలక్ష్మి, ఎం.ఎ;పిహెచ్.డి.
(ఆంధ్రోపన్యాసకురాలు, రైల్వేడిగ్రీ కాళాశాల, హైదరాబాద్)
విషయం : రామకృష్ణుని కవితారామణీయకం
సమ్మానకర్త : శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాష్
(కార్యదర్శి, విజయభావన)
వేదిక : గురజాడ స్మారక జిల్లాకేంద్ర గ్రంథాలయం, విజయనగరం
సమయం : తే || 26-07-2009 ది ఆదివారం సా|| గం|| 6.30 ని|| లకు

5, జులై 2009, ఆదివారం

విజయభావన ఆవిర్భావము

మధురభావన, మంచిమాట, సాహితీమైత్రి, సమాజచైతన్యం విజయభావన మిత్ర సమాఖ్య ఆశయం. చిగుళ్ళే చెట్లనవ్వులు, ఆశలే జీవనలతల నవ్వులు అంటూ ఈ సదాశయంతో క్రోధన ఉగాది తేదీ 22-03-1985 శుక్రవారం ఉ 10 గంలకు, సహౄదయ సాహితీ మేధావుల, మేధామథనంలోంచి ఆవిర్భవించింది విజయభావన సాహితీమిత్ర సమాఖ్య.

విజయభావన సాహితీమిత్ర సమాఖ్య వ్యవస్థాపక విజయసారథులు

1) గౌరవాధ్యక్షులు శ్రీ కూరెళ్ళ వెంకటశాస్త్రి - బి.ఎ.ఎల్.ఎల్.బి,
2) గౌరవకార్యదర్శి శ్రీ కె. కూర్మనాథం - ఎం.ఎ
3) అధ్యక్షులు డా ఆచార్యభావన్
4) ఉపాధ్యక్షులు - శ్రీ పి. మోహన్
5) కార్యదర్శి డా ఎ. గోపాలరావు
6) ఉపకార్యదర్శి చి కె. ఎస్. ఎస్. బాపూజీ
7) కోశాధికారి శ్రీ పి. ప్రసాద్